Abhishek Agarwal : కిషన్రెడ్డి ఊరిని దత్తత తీసుకున్న కార్తికేయ 2 నిర్మాత
Abhishek Agarwal : ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాల నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆ రెండు సినిమాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకున్నారు. లాభాలు కూడా బాగానే వచ్చాయి ఈ సినిమాలతో. అభిషేక్ అగర్వాల్ మరిన్ని పాన్ ఇండియా సినిమాలని నిర్మించే పనిలో ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఊరిని దత్తత తీసుకోవడం చర్చగా మారింది.
రంగారెడ్డి జిల్లా, కందుకూరి మండలానికి చెందిన తిమ్మాపూర్ గ్రామాన్ని అభిషేక్ అగర్వాల్ దత్తత తీసుకున్నారు. ఇది బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి జన్మస్థలం కావడం విశేషం. అభిషేక్ అగర్వాల్, మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు అయన స్వగ్రామాన్ని అభిషేక్ అగర్వాల్ దత్తత తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
అభిషేక్ అగర్వాల్ చంద్రకళా ఫౌండేషన్ స్థాపించి తన అమ్మమ్మ పేరుమీద పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టిన రోజు, తన అమ్మమ్మ చంద్రకళా 90వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు. తిమ్మాపూర్ లో త్వరలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టనున్నారు.