Kesineni Nani: బిల్డప్ ఇస్తే ఈడ్చికొడతారు.. కేశినేని అన్నది ఎవరిని?

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 01:46 PM

Kesineni Nani: బిల్డప్ ఇస్తే ఈడ్చికొడతారు.. కేశినేని అన్నది ఎవరిని?

Kesineni Nani: తానే సామంతరాజునని బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చికొడతారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నానీ సీరియస్ కామెంట్ చేశారు. అయితే.. ఇది ప్రత్యర్థి పార్టీ మీద చేసి ఉంటే దాదాపుగా అందరు రాజకీయ నాయకులూ చేసేదే కదా అని సైలెంట్ అయ్యే వారు. కానీ.. నానీ అన్నది సొంత పార్టీలోని సభ్యులనే కావడం ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో కేశినేని పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన కేశినేని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీ‌చేయాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని.. ఎన్నికలకు‌ చివరి మూడు నెలల్లో అభ్యర్థులు ఖరారు అవుతారని వివరించారు. జగన్ వంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే తనతో సహా అందరూ త్యాగాలకు సిద్ధం కాకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎవరికి వారు తానే సామంతరాజుననే అహంకారాన్ని పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

బెజవాడ ఎంపీగా వైసీపీ ఎమ్మెల్యే సభకు కూడా వెళ్తానని, వైసీపీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడు కాబట్టే.. మైలవరానికి ఎంపీ నిధులు ఇచ్చానని చెప్పుకొచ్చిన కేశినేని నాని.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసలు ఏపార్టీలో ఉన్నారో ముందు చెప్పాలని ప్రశ్నించడంతో మరో చర్చ మొదలయింది. అంతేకాదు, ఎవరైనా సరే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అని ఇగోకు పోతే ప్రజలే సమాధానం చెబుతారని.. తానే సామంతరాజునని బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చికొడతారంటూ సీరియస్ కామెంట్ చేశారు.

అయితే.. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఈగో అంటూ చేసిన వ్యాఖ్యలు మాజీ మంత్రి, మరో సీనియర్ టీడీపీ నేత దేవినేని ఉమా గురించేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. కొద్ది రోజులుగా కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య సాగుతున్న అధిపత్య పోరులో డైలాగ్ వార్ కొనసాగుతోంది. కొందరు టీడీపీ నేతల తీరుపై గుర్రుగా ఉన్న ఎంపీ నాని పలు సందర్భాల్లో తన ఆగ్రహం బయట పెట్టారు. ఇప్పుడు ఇలా మరోసారి బయటపడ్డారని చెప్పుకుంటున్నారు.