Jagga Reddy: బీజేపీ చరిత్ర నాకు తెలుసు.. గవర్నర్ను మార్చొచ్చు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Jagga Reddy: నేను కాంగ్రెస్ లో ఉన్నా.. కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర నాకు బాగా తెలుసు.. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ అసంతృప్తిలో ఉంది. అందుకే త్వరలోనే గవర్నర్ ను మార్చవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి గవర్నర్ బయట చాలా నరికారని.. పులి తీరుగా గాండ్రించారని.. కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారని ఎద్దేవా చేశారు. కాగా.. ఆదివారం మరోసారి మీడియాతో చిట్ చాట్ నిర్వహించి అలాంటి వ్యాఖ్యలే చేశారు.
అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్పై బీజేపీ అధిష్టానం అసంతప్తిలో ఉందని.. అందుకే బీజేపీ తమిళిసైని మార్చొచ్చని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, నేను ఎవరికి బానిస కాదు.. ఎవరికి లాలూచీ పడనన్న ఆయన.. పేదలకు సాయం అవుతుందంటే.. ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులు అయినా చూడనని వెల్లడించారు. నేను అసెంబ్లీలో విమర్శల కన్నా.. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు.
రాజకీయంగా బీఆర్ఎస్ని తిట్టి ఆహో.. అనిపించుకోవాలనే దానికంటే.. ప్రజల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చూశానని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ని తిడితే పది మంది సంతోష పడతారు కానీ.. సమస్యలు చెప్తే.. పరిష్కారం అయినా అవుతుందన్నారు. సదాశివపేటవరకు మెట్రో కావాలని డిమాండ్ లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. యాదగిరిగుట్ట పునర్నిర్మాణం మంచి నిర్ణయమని.. అయితే, అక్కడికి కూడా మెట్రో వేయాలని కోరారు.
ఇక, కేసీఆర్ సర్కారుపై కొన్ని ప్రశంసలు కూడా ఇచ్చారు. కేసీఆర్ కిట్ తో మహిళకు బెనిఫిట్ అవుతుందన్నారు. అది ఒప్పుకోవాల్సిందేనని, క్యాన్సర్, హార్ట్ ఆపరేషన్ లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచన చేశానన్నారు జగ్గారెడ్డి. కల్యాణ లక్ష్మీ మంచి పథకమేనని, మంచిని మంచి అనాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు. కాగా, వృద్ధాప్య పింఛన్లు ఇంట్లో ఇద్దరికి ఇవ్వాలన్నారు. కాగా, బీజేపీ తెలంగాణలో ఎన్ని గేమ్స్ ఆడినా.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని ఆయన స్పష్టం చేశారు.