AP Govt: జీఓ నంబర్ 1 మంటలు.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 08:07 PM

AP Govt: జీఓ నంబర్ 1 మంటలు.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్

AP Govt: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 మంటలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరు.. గుంటూరులో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాలలో 11 మంది కార్యకర్తలు మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో 1 తీసుకొచ్చింది. 1861 పోలీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 30 ప్రకారం.. రోడ్లపై ప్రదర్శనలు, కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

టీడీపీతో పాటు జనసేన, కమ్యూనిస్టులు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు అడుగడునా అడ్డుకోగా తీవ్ర దుమారం రేగింది. దీంతో జీవో నెంబర్-1ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే జీవో నెంబర్-1ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో సీపీఐ రామకృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు.

భావ ప్రకటనా స్వేచ్ఛా, ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఆ జీవో ఉందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు. జీవోను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని రామకృష్ణ అభ్యర్థించారు. ఫైనల్ గా హైకోర్టు చేరిన జీవోను ధర్మాసనం స్టే ఇచ్చింది. సీపీఐ రామకృష్ణ తరపున లాయర్‌ అశ్వినీకుమార్ వాదించగా.. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ వాదించారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. జీవో నెంబర్ 1పై ఈ నెల 23 వరకూ సస్పెన్షన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

అయితే తదుపరి విచారణ జరగక ముందే.. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 1 కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం అందింది. సుప్రీం కోర్టు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది. మరి ఇక్కడ తీర్పు ఎలా ఉండనుందో చూడాలి.