Chinta Mohan: 2024 ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఊహించని పరిణామాలు!
![Chinta Mohan: 2024 ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఊహించని పరిణామాలు!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Chintha-Mohan.jpg)
Chinta Mohan: 2024 ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఊహించని పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై తీసుకొచ్చిన జీవోపై స్పందించిన చింతా.. తొక్కిసలాటను సాకుగా చూపి వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. స్వేచ్చ ఉన్న దేశంలో మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు సరికాదన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక రానున్న 2024 ఎన్నికలపై స్పందించిన చింతా మోహన్.. వచ్చేది ఇద్దరు చంద్రుల మధ్య యుద్ధమేనని.. అటు తెలంగాణలో చంద్రబాబు మీటింగ్స్ పెడితే.. ఇటు ఏపీలో చంద్రశేఖర్ రావు మీటింగ్ పెడతారని.. బీఆర్ఎస్, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలతాయని చెప్పారు. ఇక ఏపీలో జగన్ పైకి ఎన్ని చెప్పినా వైసీపీ పతనం ఖాయమైపోయిందన్నారు. రాష్ట్రంలో తాను గుడిసె గుడిసెకి తిరిగానని చెప్పిన చింతా జగన్ పై ప్రజలలో ఆక్రోశం ఉందని వారి తిట్లు కూడా దీవెనలుగా తీసుకుంటే జగన్కే మంచిదని సూచించారు. వైసీపీని సాగనంపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని సెటైర్లు వేశారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని 18 ఏళ్ల క్రితమే ఊహించాను.. ఆనాడే మా అధిష్టానానికి వివరంగా లేఖ రాశాను అని గుర్తుచేసుకున్నారు. 2004లోనే మా పార్టీ వాళ్లకు నేనే చదివి స్వయంగా వినిపించాను.. కాంగ్రెస్ పార్టీ పతనాన్ని నేను అప్పుడే ఊహించి చెప్పానన్నారు. ఇక కేంద్రంలో కూడా బీజేపీ పతనం ప్రారంభమైందన్న చింతా పెట్రోల్ ధర వంద కావాలంటే రూపాయి విలువ పతనం కావాలని మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ఆయన.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు కేంద్రంలో కూడా వచ్చే ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు ఉండనున్నాయని జోస్యం చెప్పారు.