Byreddy Siddharth: బైరెడ్డి పంచ్లు.. తెలంగాణలో జగన్ వేలు పెడితే సీన్ మారిపోతుందా?
Byreddy Siddharth: వైఎస్ జగన్ కు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అభిమానులు ఉన్నారు, ఆయన కనుక మళ్ళీ తెలంగాణలో వేలు పెడితే తెలంగాణ రాజకీయాల సీన్ మారిపోతుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఏపీలో వైసీపీలో యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. ఆ మాటకొస్తే ఇప్పుడే కాదు.. గత కొన్నాళ్ళుగా సిద్దార్థ్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. నిజానికి ఏపీ రాజకీయాల్లో అందునా రాయలసీమలో మంచి భవిష్యత్ ఉన్న యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.
పక్కా రాయలసీమ యాసలో ఆయన ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వైసీపీలో నేతలకే కాదు మిగతా పార్టీల నేతలకు కూడా కొందరికి ఇష్టమే. ఇలాంటి క్రమంలో ఈమధ్య సిద్దార్థ్ దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. ఇంతకాలం నందికొట్కూరు ఇంచార్జ్ గానే కనిపించిన బైరెడ్డికి జగన్ సర్కార్ శాప్ ఛైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు తాజాగా వైసీపీ యూత్ సెల్కు కూడా బైరెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. దీంతో ఆయన రాష్ట్రం మొత్తం పర్యటించడం మొదలుపెట్టారు.
ఇన్ని పదవులు ఇచ్చిన తర్వాత ఆయన ఊరికే ఉంటారా.. ప్రత్యర్ధి పార్టీలపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. ఇటు చంద్రబాబుపైనా, అటు పవన్ పైనా తనదైన శైలిలో విమర్శించడం చేస్తున్నారు. జనసేనానిని రంగం సినిమాలో విలన్ గా, అత్యంత మోసగాడిగా విమర్శిస్తున్న బైరెడ్డి.. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు, పేద ప్రజలను మోసం చేసింది ఎవరైనా ఉంటే అది చంద్రబాబు అని విరుచుకుపడుతున్నారు.
మరి.. సోషల్ మీడియాలో హీరోగా మారిన బైరెడ్డి వ్యాఖ్యలకు నెటిజన్లు ఊరికే ఉంటారా? అందునా తెలంగాణలో వేలు పెడితే అని కెలికితే ఊరికే ఉంటారా? తెలంగాణ నెటిజన్లు ఓ రేంజిలో విరుచుకుపడుతుంటే.. ఏపీలో జనసైనికులు మరో రేంజిలో తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. జగన్ ఎవరికి పదవి ఇస్తే వాళ్ళు ఇలా ప్రతిపక్షాలను తిట్టడమే పనా.. లేక ఇచ్చిన పదవిలో ప్రజలకు పనిచేయమని పదవులు ఇచ్చారా అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు.