TDP: బాబుతో బాలయ్య సంబరాలు.. భోగి మంటల్లో జగన్ జీవో నంబర్.1!

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 11:25 AM

TDP: బాబుతో బాలయ్య సంబరాలు.. భోగి మంటల్లో జగన్ జీవో నంబర్.1!

TDP: నారా – నందమూరి కుటుంబాలు సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. నారావారిపల్లెలో భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వచ్చిన ఆయన బావమరిది, నటుడు, ఎమ్మెల్యే బాలయ్య కుటుంబసభ్యులతో కలిసి భోగిమంటలు వేశారు. రెండు కుటుంబాలతో పాటుగా బంధువులు, గ్రామస్థులు వారితో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ మాట్లాడిన బాలయ్య రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. బాలయ్య ప్రతీ ఒక్కరినీ పలకరించి భోగి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.

తన సినిమా వీరసింహారెడ్డి సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన బాలయ్య.. నవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబుకు పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీ నేతలు..కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రాగా అందరి సమక్షంలోనే భోగి మంటలు వేసారు. పనిలో పనిగా ప్రభుత్వం ఈమధ్య తీసుకు వచ్చిన జీవో నెంబర్.1ను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

ప్రజలపై పన్నులు, ఛార్జీలు వేస్తూ జగన్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించిన చంద్రబాబు.. జగన్ పాలనతో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. రాజకీయాల్లో ఉండేందుకు జగన్ కు అర్హత లేదన్నారు. తానుప్రజల భవిష్యత్ కోసం బతుకుతున్నానని అన్నారు. భారత దేశ గొప్ప సంపద యువత అని అన్నారు. 2047 వరకు ఒక విజన్ సిద్ధం చేసుకోవాలని ఇటీవల జీ 20 చర్చల సందర్భంగా ప్రధానికి సూచించినట్టు చంద్రబాబు చెప్పారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలు భోగి మంటలు వేసి అందులో జీవో 1 కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు భోగి మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలను వేసి దహనం చేశారు. గుంటూరులో ఆలపాటి రాజా భోగి మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలను వేసి దగ్ధం చేశారు. ఏలూరులోని దెందులూరులో చింతమనేని ప్రభాకర్ భోగి మంటల్లో జీవో నెం.1 కాపీలు వేశారు.