New Political Party: ఏపీలో మరో కొత్త పార్టీ.. టార్గెట్ ఉత్తరాంధ్ర వయా అమరావతి!

New Political Party: ఏపీలో ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలున్నాయి. అందులో కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలైతే.. జాతీయ గుర్తింపున్న ప్రాతీయ పార్టీ టీడీపీ. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇంకా ఉనికిలో ఉన్నాయి. ఇవి కాకుండా తెలంగాణ నుండి కేసీఆర్ బీఆర్ఎస్ ఈసారి ఎన్నికలకు ఏపీలో కూడా సిద్ధమవుతుండగా.. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ గుర్తింపు కోసం అడపాదడపా ఏపీలో పోటీ చేస్తుంటాయి.
ఉన్న పార్టీలు కాకుండా ఇప్పుడు ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అది కూడా ఉత్తరాంద్ర టార్గెట్ గా.. ఉత్తరాంధ్ర హక్కుల కోసం.. ఉత్తరాంధ్ర పరిరక్షణ సిద్ధాంతాన్ని తలకెత్తుకొని.. వయా అమరావతి రాజధానికి వ్యతిరేకంగా.. మూడు రాజధానులకు అనుకూలంగా ఈ కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తున్నట్లు తెలుస్తుంది. జై ఉత్తరాంధ్ర పేరుతో ఈ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమౌతుందట.
ఈ కొత్త పార్టీ కోసం ఇప్పటికే రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో సన్నాహాక సమావేశం కూడా నిర్వహించగా.. పార్టీ ఆవిర్భావం కోసం పనులు మొదలైపోయినట్లు చెప్తున్నారు. త్వరలోనే జై ఉత్తరాంధ్ర పేరిట అధికారిక ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకపక్క ఉత్తరాంధ్రలో కొత్త పార్టీ రాబోతుందని ప్రచారం జరుగుతుండగానే ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖ రాజధాని, ఉత్తరాంధ్రలో కొత్త పార్టీపై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి.
మూడు రాజధానులు వద్దు.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలంటే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నారు మంత్రి ధర్మా న ప్రసాదరావు. అమరావతిలో భూములన్నీ కొనేసిన చంద్రబాబు.. అక్కడే రాజధాని పెట్టి దాన్ని మరో హైదరాబాద్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే అమరావతే రాజధానిగా ఉంటుందంటే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను రాష్ట్రం చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులే తమ సిద్ధాంతమని బల్లగుద్ది మరీ చెప్తుంది. సీఎం జగన్ సహా.. పార్టీలో ముఖ్యులైన సజ్జల లాంటి వారి నుండి.. ఆ పార్టీలో ఉత్తరాంధ్ర ప్రముఖులైన బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు సమయం చూసి మళ్ళీ మూడు రాజధానులపై అసెంబ్లీలో కొత్త బిల్లు తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. ఒకపక్క ప్రభుత్వం మూడు రాజధానులే తమ సిద్ధాంతం అంటున్నా మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు.. ఉత్తరాంధ్ర పార్టీ ఆవిర్భావం జరగబోతుందనే ప్రచారం ఇప్పుడు ఏపీలో సంచలనం కాగా.. ఇక ఈ ఉత్తరాంధ్ర రాష్ట్ర సిద్ధాంతం ఎంతవరకు వెళ్లబోతుందో చూడాల్సి ఉంది.