Ratha saptami celebrations at Arasavalli: అరసవెల్లిలో రథసప్తమి ఉత్సవాలు ఎలా జరిగాయో తెలుసుకున్నారా?
అరసవల్లిలో గల సూర్యదేవాలయంలోని ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు సా.శ. 7 వ శతాబ్థానికి చెందినవని, చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. ఒరిస్సాలోని సుప్రసిద్ధమైన కోణార్క్ సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు. మరి సూరీడు అవతరించిన రథసప్తమి అయిన ఈరోజు అక్కడి విశేషాలేంటో తెలుసుకుందాం.
ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఙులు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిన్న అర్థరాత్రి నుంచి రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
శుక్రవారం రాత్రి నుంచే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. అర్ధరాత్రి నుంచి ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదినారాయణుడిని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహార్ లాల్, ఎమ్మెల్యే లు జోగులు, కిరణ్, MLC లు దువ్వాడ శ్రీనివాస్, విక్రాంత్ లు దర్శించుకున్నారు.