Nishkalanka Mahadev: ఉదయమంతా సముద్రంలో మునిగి, మాద్యాహ్నం నుండి దర్శనమిచ్చే దేవాలయమేదో తెలుసా..?
![Nishkalanka Mahadev: ఉదయమంతా సముద్రంలో మునిగి, మాద్యాహ్నం నుండి దర్శనమిచ్చే దేవాలయమేదో తెలుసా..?](https://kaburulu.com/wp-content/uploads/2022/12/Nishkalanka-Mahadev-Temple.jpg)
గుజరాత్ లోని కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే పర్యాటకులకు ఇక్కడ అసలు ఆలయం ఉన్నట్లే కనిపించదు. ఎందుకంటే అదే సమయంలో ఆ దేవాలయం పూర్తిగా సముద్రంలో మునిగి, మధ్యలో ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటల నుండి సముద్రం నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది.
ఈ ఆటుపోటుల కారణంగానే భక్తులు ఆలయానికి చేరుకునేందుకు, నీటిలో మునిగేందుకు కారణం అవుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయాన్ని దర్శించిన వారు భారతీయుల శిల్పకళా వైభవాన్ని, వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొగడకుండా ఉండలేరు.
మహాభారత యుద్ధంలో తన సొంత బంధువులను హరించిన పాండవులకు తగిలిన పాపాలను నుండి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయించగా, అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్లమంటాడు. ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని చెబుతాడు. ఆ ఆవు, జెండా ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే తెలుపు రంగును పొందుతాయి అప్పుడు పాండవులు పాపలనుండి ముక్తి పొందుతారని, ఆ కారణంగానే పాపాలను తొలగించే శివుడుగా, నిష్కలంక మహాదేవ ఆలయంగా పిలుస్తున్నారని స్థల పురాణం చెబుతుంది.