Lord Brahma Temple:బ్రహ్మదేవుడి ఆలయాన్ని దర్శించారా ఎప్పుడైనా…?
![Lord Brahma Temple:బ్రహ్మదేవుడి ఆలయాన్ని దర్శించారా ఎప్పుడైనా…?](https://kaburulu.com/wp-content/uploads/2022/12/Chebrolu-Brahma-Temple.jpg)
భూమి మీద బ్రహ్మదేవుడికి ఎక్కడా పూజలు చేయరు కారణం భృగు మహర్షి పెట్టిన శాపం. బ్రహ్మకు ఆలయాలు కూడా ఉండవని పురాణాలు చెబుతున్నాయి. కానీ రాజస్థాన్ లోని పుష్కర్, తమిళనాడు లోని కుంభకోణం, కాశీలో, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లోని ప్రత్యేక ప్రదేశాల్లో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయి. వాటి విశిష్టత ఏంటో ఇపుడు తెలుసుకుందాం.
ప్రముఖ బ్రహ్మదేవుడి ఆలయాల్లో చేబ్రోలులో ఉన్న ఆలయం ఒకటి. ఇక్కడి చతుర్ముఖ బ్రహ్మ దేవుడి ఆలయాన్నిరెండో కాశీగా పిలుస్తారు. బ్రహ్మకు ప్రత్యేక రూపం లేనందున శివ లింగం రూపంలోనే, నాలుగు వైపులా అందంగా చెక్కబడిన నాలుగు బ్రహ్మ ముఖాలతో దర్శనమిస్తాడు. శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉండటంతో ఆలయానికి విచ్చేసిన భక్తులు, ఒకేసారి శివుడిని, బ్రహ్మదేవుడిని దర్శించుకున్నట్టు భావిస్తారు.
చేబ్రోలులో బ్రహ్మదేవుడి ఆలయాన్ని 1817లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించారు. పెద్ద కోనేరును తవ్వించి, ఆలయాన్ని నిర్మించి, బ్రహ్మదేవుడిని ప్రతిష్టించారు. పద్మాకారంలో ఉండే పానపట్టంపై లింగానికి నాలుగు వైపులా బ్రహ్మ 4 ముఖాలనూ రూపొందించారు. గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం మరో విశేషం. భక్తులు ఎటునుంచైనా స్వామిని దర్శించుకోవచ్చు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలూ రోజూ చేస్తూ ఉంటారు.