Vaikunta Ekadashi:వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లే భక్తులు ఈ సూచనలు విన్నారా?
![Vaikunta Ekadashi:వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లే భక్తులు ఈ సూచనలు విన్నారా?](https://kaburulu.com/wp-content/uploads/2022/12/New-Project-4.jpg)
ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 2వ తేదీన రానుంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు 10 రోజులు నిర్వహిస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. కాబట్టి ఈ పదిరోజుల్లో ఏ రోజైనా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని టిటిడి తెలిపింది. అలాగే దర్శనానికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించింది.
ఈ సారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిన భక్తులకు టికెట్లు తప్పనిసరి చేసింది టిటిడి. సర్వదర్శనం టికెట్లు రోజుకు 25వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రోజుకు 50వేలు అందుబాటులో ఉంచనున్నారు. ఇలా మొత్తం 10రోజులకు 5లక్షల సర్వదర్శన టికెట్లు కేటాయించనున్నారు. తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒకటి కలువుకొని మొత్తం 10 టికెట్ల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ టికెట్లకు ఆధార్ కార్డులను తప్పనిసరి చేసింది టిటిడి. ఈ పదిరోజులు అన్ని ప్రివిలేజ్ దర్శనాలు నిలిపివేసి, శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో రోజుకు రెండువేలు కేటాయించనున్నారు. గోవింద మాలలు వేసే భక్తులకు కూడా టికెట్లు తప్పనిసరని టిటిడి స్పష్టం చేసింది.
విఐపి దర్శనాలు జనవరి 2వ తేదీ తెల్లవారుజామున1.40 గంటలనుండి ఉంటుందని, 5 గంటలనుండి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుందని టిటిడి తెలిపింది. రాజ్యాంగ హోదాఉన్న వీఐపీలు వస్తే మాత్రం వారికి బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపింది. ఆలయ బంగారు తాపడం పనులు ఫిబ్రవరి 23వ తేదీ నుండి ప్రారంభమవుతాయని టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు.