Dhwajasthambham: దేవాలయాలలో ఉండే ధ్వజ స్తంభం ప్రాముఖ్యత ఏంటో తెలుసా…?
![Dhwajasthambham: దేవాలయాలలో ఉండే ధ్వజ స్తంభం ప్రాముఖ్యత ఏంటో తెలుసా…?](https://kaburulu.com/wp-content/uploads/2022/12/Dhwajasthambham.jpg)
ధ్వజస్తంభాన్ని హిందూ దేవాలయాలలో ఒక ప్రధానమైన భాగంగా చెబుతారు. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఒక ఆచారం. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవట. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారట. మరి ఇంతటి విశేషాలున్న ధ్వజస్తంభం చరిత్ర ఏంటో ఇపుడు తెలుసుకుందాం.
ప్రస్తుతంకార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి, సాంప్రదాయపరంగా పూజలు చేస్తున్నారు. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానంగా భావిస్తారు. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించాకనే మూలవిరాట్టుని దర్శిస్తారు.
ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉంటుంది. చెక్కతో తయారుచేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని కొన్ని దేవాలయాలో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. గుడిలో భగవంతునికి చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి. ఎందుకంటే వీటి స్థాయి మూల విరాట్టుతో సమానంగా ఉంటుంది. దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణ చేయాలి.