History Chaya Someshwar Temple: ఈ దేవాలయంలోని నీడ ఎప్పటికీ కదలదు…. ఒకే స్థానంలో ఉంటుంది…!
![History Chaya Someshwar Temple: ఈ దేవాలయంలోని నీడ ఎప్పటికీ కదలదు…. ఒకే స్థానంలో ఉంటుంది…!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Chaya-Someshwar-Temple.jpg)
సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఒకటి చాయా సోమేశ్వర దేవాలయం. ఈ ఆలయ సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలున్నాయి. ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో పానగల్లు మ్యూజియం కూడా ఉంది.
ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్బగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం. దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్థానాన్ని మార్చుకోదు.
ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్ లెక్చరర్. గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం… ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ విషయాలనే ప్రయోగాత్మకంగా సూర్యాపేటకు చెందిన మనోహర్ నిరూపించాడు.