Rama Navami Bhadradri: గోటి తలంబ్రాలతో భద్రాద్రి రాములోరి కల్యాణానికి భక్తుల పాదయాత్ర…!

Kaburulu

Kaburulu Desk

March 26, 2023 | 09:58 PM

Rama Navami Bhadradri: గోటి తలంబ్రాలతో భద్రాద్రి రాములోరి కల్యాణానికి భక్తుల పాదయాత్ర…!

గత 20 సంవత్సరాల నుండి భక్తులు భద్రాద్రి సీతారాముల కళ్యాణ ఉత్సవానికి తలంబ్రాలను గోటితో వలచి పాదయాత్రగా వెళ్ళి సమర్పిస్తారు. మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఏర్పాట్లు చేశారో… అసలు ఆ భక్తులు ఏ ప్రాంతం వారో ఇపుడు తెలుసుకుందాం.

భద్రాద్రి శ్రీసీతారామ కళ్యాణం ఈ నెల 30న భద్రాచలంలో వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పది గ్రమాల భక్తులు కలిసి స్వామివారి కళ్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేశారు. శ్రీరామ ఆథ్యాత్మిక సమితి జంగారెడ్డి గూడెం నుంచి 20 ఏళ్లుగా ప్రతిఏటా కోదండరాముని కళ్యాణానికి గోటితో వొలిచిన తలంబ్రాలను భక్తులంతా కలిసి పాదయాత్రగా వెళ్లి సమర్పిస్తారు. ఈ యాత్ర పొడవునా.. భక్తులకు పోటీపడి మరీ వసతి సౌకర్యాలు కల్పిస్తారు ఆయా ప్రాంతాలవారు. ఈ ఏడాది 300 కేజీలు గోటితో వొలిచిన తలంబ్రాలు సిద్ధం చేశారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లోని 100 గ్రామాల నుంచి 10 వేల మందికి పైగా భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ పాదయాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. మార్చి 26న ప్రారంభమై 29వ తేదీ మధ్యాహ్నానికి భద్రాద్రికి చేరుకుంటారు. తిరిగి వచ్చిన తర్వాత స్వామివారి కళ్యాణ తలంబ్రాలను ఆయా గ్రామాల్లోని భక్తులందరికీ పంచుతారు.

పాదయాత్రను రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు తపన చౌదరి, నిర్వాహకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. గోటి తలంబ్రాలతో రామదండు భద్రాద్రికి పయనమైంది.. భక్తులు ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేసుకొని క్షేమంగా తిరిగిరావాలని శ్రీరామ ఆథ్యాత్మిక సమితి సభ్యులు ఆకాంక్షించారు.