Taraka Ratna: తారకరత్నని బెంగళూరు తరలింపు.. కర్ణాటక సీఎంతో మాట్లాడిన చంద్రబాబు
![Taraka Ratna: తారకరత్నని బెంగళూరు తరలింపు.. కర్ణాటక సీఎంతో మాట్లాడిన చంద్రబాబు](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Taraka-rathna.jpg)
Taraka Ratna: టీడీపీ కుప్పం యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ఆయన గుండెపోటుకు గురైనట్టు వైద్యులు తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరు తరలించారు. నిన్న రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తెలు ఆసుపత్రికి వచ్చిన తర్వాత తారకరత్నను బెంగళూరు తరలించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండగా.. రక్తపోటు సాధారణంగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్న నిన్న ఉదయం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిమానుల తాకిడికి తోడు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో తారకరత్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ఆ తర్వాత లక్ష్మీపురంలోని మసీదు వద్ద కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనను పక్కకు తీసుకెళ్లారు. పావుగంట తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుండెపోటు రావడంతో కిందపడిపోబోయారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు ఆయనను పట్టుకున్నారు. ఆ తర్వాత కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి శుక్రవారం రాత్రికి బెంగళూరు తరలించారు.
బెంగళూరులో తారకరత్నకు చికిత్స నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో ఫోన్ లో మాట్లాడి.. బెంగళూరు నగరంలో గ్రీన్ చానల్ ఏర్పాటు చేయించారు. బెంగళూరు వైద్యులతో చంద్రబాబు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే బాలకృష్ణ కుప్పం వెళ్లి తారకరత్న పరిస్థితి తెలుసుకోగా.. జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు.