Taraka Ratna: తారకరత్నకు క్రిటికల్ ట్రీట్మెంట్.. బెంగళూరుకి చంద్రబాబు, జూ.ఎన్టీఆర్?

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 12:07 PM

Taraka Ratna: తారకరత్నకు క్రిటికల్ ట్రీట్మెంట్.. బెంగళూరుకి చంద్రబాబు, జూ.ఎన్టీఆర్?

Taraka Ratna: టీడీపీ యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం వెళ్లిన నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ఆయన గుండెపోటుకు గురైనట్టు వైద్యులు తెలిపారు. ముందుగా కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి శుక్రవారం రాత్రికి బెంగళూరు తరలించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

నారాయణ హృదయాలయంలో వైద్యులు ఆయనకు క్రిటికల్ చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. తారకరత్న రక్తనాళాల్లో 95 శాతం బ్లాక్స్ ఉండడంతో గుండె దాదాపు పనిచేయడం లేదని.. ఎక్మో అమర్చడం వలన శరీర భాగాలకు ఆర్టిఫీషియల్ గా రక్తం, ఆక్సిజన్ అందుతున్నట్లు చెప్తున్నారు. గుండె, ఊపిరితిత్తులు పనిచేయని సందర్భంలోనే ఎక్మో ద్వారా చికిత్స అందిస్తారని వైద్యులు చెప్తున్నారు.

శుక్రవారం రాత్రి ఆధునిక వైద్య పరికరాల సపోర్టు కలిగిన అంబులెన్సులో తారకరత్నను బెంగళూరుకు షిఫ్ట్ చేయగా అంబులెన్సుతో పాటే బాలకృష్ణ కూడా బెంగళూరుకు వెళ్లారు. తొలి రోజు పాదయాత్ర ముగిసిన తరువాత లోకేశ్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడే బాలకృష్ణతో పాటు తారకరత్న తల్లి, భార్య, కుమార్తెలు కూడా ఉన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగళూరు వెళ్లనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

శనివారం సాయంత్రానికి చంద్రబాబు, ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబం నుండి మరికొందరు కూడా బెంగళూరు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. తారకరత్న ఆరోగ్యంపై నందమూరి కుటుంబంలో ఆందోళన కనిపిస్తుండగా.. బాలకృష్ణ కుటుంబ సభ్యులకు తారకరత్నకు అందిస్తున్న వైద్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఆందోళన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. మరికాసేపట్లో తారకరత్నకు అందిస్తున్న వైద్యం.. ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల కానుండగా.. ఆ తర్వాత కానీ ఆయన ఆరోగ్యంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.